హైదరాబాద్:
సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సి) పదో తరగతి
పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి
ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆయన పదో తరగతి
పరీక్షా ఫలితాల సిడిని విడుదల చేసారు. అయితే ఈసారి ఫలితాల
ప్రకటనలో ప్రభుత్వం మార్పులు చేసింది. మార్కులను ప్రకటించకుండా గ్రేడులు మాత్రమే ఇచ్చారు. ఫెయిలైన విద్యార్థులకు ఇ గ్రేడ్ ఇచ్చారు.
మొత్తం
విద్యార్థినీవిద్యార్థుల్లో
87.84 శాతం ఉత్తీర్ణలైనట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఇది నిరుటి కన్నా
4.7 శాతం అధికం. ఎస్ఎస్సి
ఫలితాల్లోనూ అమ్మాయిలే ఆధిక్యతను చాటారు. అమ్మాయిలు 88.76 శాతం మంది ఉత్తీర్ణులు
కాగా, అబ్బాయిలు 86.98 శాతం మంది పాసయ్యారు.
ఫలితాల్లో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా
హైదరాబాదు చివరి స్థానంలో నిలిచింది.
కరీంనగర్ జిల్లాలో 93.38 శాతం మంది ఉత్తీర్ణలు
కాగా, హైదరాబాదు జిల్లాలో 76.94 శాతం మంది మాత్రమే
ఉత్తీర్ణులయ్యారు.
సప్లిమెంటరీ
పరీక్షలు జూన్ 26వ తేదీ నుంచి
జరుగుతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 17 పాఠశాలలు జీరో ఉత్తీర్ణతను సాధించాయి.
అత్యధిక ఫలితాలు సాధించిన జిల్లాల్లో కడప రెండో స్థానంలో
నిలువగా, నల్లగొండ మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్ర
హైకోర్టు ఆదేశాల మేరకు.. ఈనెల 24వ తేదీన విడుదల
చేయనున్న పదో తరగతి పరీక్షా
ఫలితాల నుంచే ఈ 'సంపూర్ణ
గ్రేడింగ్ పద్ధతి'ని అమలు చేశారు.
ఫలితాల సీడీలో గానీ.. తర్వాత పాఠశాలలకు పంపే మెమోలో గానీ..
ఎక్కడా విద్యార్థుల మార్కులు తెలిసే అవకాశం లేకుండా చూశారు. విద్యాసంస్థల మధ్య అనారోగ్యకర పోటీని
నియంత్రించటంతో పాటు విద్యార్థులపై మానసిక
ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు
విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కూడా టెన్త్ ఫలితాల్లో
'తొమ్మిది పాయింట్ల స్కేల్'ను గ్రేడింగ్లో
అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత
రెండేళ్లుగా గ్రేడింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. కానీ,
దీంతో పాటు మార్కులను కూడా
విడుదల చేస్తున్నారు.
2009 అక్టోబర్
23న మాథ్యమిక విద్యాశాఖ జారీచేసిన జీవోఆర్టీ నెం.592 ప్రకారం 2010లో గ్రేడింగ్ పద్ధతి
అమల్లోకి వచ్చింది. అయితే గ్రేడింగ్తో
పాటు మార్కులు కూడా విద్యార్థులు తెలుసుకునేలా
అప్పుడు ఏర్పాటు చేశారు. మార్కుల మెమోలపై మార్కులు, గ్రేడులు.. రెండింటినీ నమోదు చేస్తున్నారు. ఇలాగైతే
ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తడంతో , సంపూర్ణ గ్రేడింగ్ ఎలా ఉండాలో వివరిస్తూ
2011 మే 17న మాథ్యమిక విద్యాశాఖ
మళ్లీ జీవోఆర్టీ నెం.419ని విడుదల చేసింది.
అప్పటికే పదో తరగతి పరీక్షా
ఫలితాలు విడుదల చేసినందున ఆ విషయం మరుగున
పడిపోయింది.
దీంతో
కొందరు ఈ విషయాన్ని హైకోర్టులో
సవాల్ చేశారు. సదరు జీవో ప్రకారం
'సంపూర్ణ గ్రేడింగ్ పద్ధతి'ని అమలు చేయాలని
పాఠశాల విద్యాశాఖను కోర్టు ఆదేశించింది. దీంతో.. మాథ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి అధికారులతో
ఈ అంశంపై గురువారం సమీక్షించారు. మాథ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్, ప్రభుత్వ
పరీక్షల డైరెక్టర్ బి.మన్మధరెడ్డి, సంబంధిత
అధికారులు దీనిపై చర్చించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల ప్రకారం.. మార్కులు ఇవ్వకుండా మొత్తం గ్రేడులే ఇవ్వాలని నిర్ణయించారు.
0 comments:
Post a Comment