ఒంగోలు:
దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డి తనను కూడా బెదిరించారని
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్)
నేత మందకృష్ణ మాదిగ చెప్పారు. వైయస్
తెలంగాణపై తనను బెదిరించారని మంత్రి
బస్వరాజు సారయ్య అన్న విషయం తెలిసిందే.
'నీ ఉద్యమాలు తెలుసు..నీ డ్రామాలూ తెలుసు.
నా సంగతే నీకు పూర్తిగా
తెలియదు. జాగ్రత్తగా బతుకు' అని వైఎస్ రాజశేఖరరెడ్డి
తనను బెదిరించారని మంద కృష్ణమాదిగ అన్నారు.
హృద్రోగ చిన్నారుల కోసం ఉద్యమించిన సమయంలో
వైఎస్ నుంచి తీవ్ర హెచ్చరికలను
ఎదుర్కొవాల్సి వచ్చిందని చెప్పారు. వైయస్ కుమారుడు వైఎస్
జగన్ పార్టీకి ఓటేస్తే అణగారిన వర్గాలు మరింత అణగిపోతాయని చెప్పారు.
ఈ నెల ఐదో తేదీ
నుంచి ప్రారంభమైన మాదిగల తిరుగుబాటు యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా
కందుకూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన
సభలో వైఎస్, జగన్లపై నిప్పులు
చెరిగారు. హృద్రోగ చిన్నారులకు వైఎస్ ప్రభుత్వమే దగ్గరుండి వైద్యం చేయించడం వెనక ఎమ్మార్పీఎస్ ఉద్యమ
కృషి దాగున్నదని అన్నారు. అదే అనంతర కాలంలో
ఆరోగ్యశ్రీ ఆలోచనకు దోహదపడిందని వెల్లడించారు. ఈ క్రమంలో తాను
వైఎస్ బెదిరింపులను సైతం తట్టు కొని
నిలబడాల్సివచ్చిందని గుర్తు చేసుకున్నారు.
హృద్రోగ
నిరుపేద చిన్నారులకు ప్రభుత్వమే వైద్యం చేయించాలనే డిమాండ్తో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో
ధర్నా చేస్తున్నామని, అప్పుడు వైఎస్ ఢిల్లీలో ఉన్నారని, ధర్నా విషయం తెలుసుకొని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశారని, తనతో
నన్ను మాట్లాడించమని ఆదేశించారని, తాను ఫోన్ తీసుకుని
"సార్'' అని అనగానే బెదిరింపు
స్వరం వినిపించిందని ఆయన వివరించారు.
అయితే,
ఉద్యమ తీవ్రతకు వైఎస్ దిగరాక తప్పలేదని, ప్రభుత్వం ఖర్చుతో బాధిత చిన్నారులకు వైద్యం
చేయిస్తామని ఢిల్లీలోనే ఆయన ప్రకటించక తప్పలేదని
చెప్పారు. దోపిడీని జగన్ విశృంఖల స్థాయికి
తీసుకెళ్లారని, అలాంటివాడు పేదలను ఉద్దరిస్తాడనుకోవడం భ్రమే. ఎస్సీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటూ
కొంతమంది జగన్ భజన చేస్తున్నారని
విమర్శించారు. యుద్దాన్ని వదిలేసి, వారంతా అంబేద్కర్ సిద్ధాంతానికి బద్ధవ్యతిరేకి అయిన జగన్ జపం
చేస్తుండటం ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని
ఆయన అన్నారు.
0 comments:
Post a Comment