హైదరాబాద్:
రాష్ట్ర రాజధానిలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు గురువారం హల్ చల్ చేశారు.
అధికార పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు రెండు
రోజుల క్రితం సభ నుండి సస్పెండ్
అయిన విషయం తెలిసిందే. వారు
రెండు రోజుల పాటు ఢిల్లీలో
పార్లమెంటు భవనం ఎదుట తమ
నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గురువారం వారు హైదరాబాద్ వచ్చారు.
శంషాబాద్
విమానాశ్రయానికి భారీ ఎత్తున చేరుకున్న
తెలంగాణవాదులు వారికి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు తదితరులతో కలిపి ఎంపీలు ర్యాలీగా
విమానాశ్రయం నుండి అసెంబ్లీ ఎదురుగా
ఉన్న గన్ పార్క్ వద్దకు
చేరుకున్నారు. మొదట అమరవీరుల స్థూపానికి
నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటు
చరిత్రలో ఇంతమంది అధికార పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమమని
మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా
మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ సాధనే తమ ఏకైక
లక్ష్యమన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువత
ఆత్మార్పణం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు.
తెలంగాణను
వెంటనే ఏర్పాటు చేయాలని తాము పార్టీని కోరినట్లు
చెప్పారు. ఇలాంటి పరిస్థితిల్లో తెలంగాణవాదులు అందరూ కలిసికట్టుగా ఉద్యమించాల్సి
ఉందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని ముందుకు
తీసుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరూ ఆత్మహత్యలు
చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. టి-ఎంపీలంతా తెలంగాణకు
కట్టుబడి ఉన్నారని చెప్పారు.
నాలుగున్నర
కోట్ల తెలంగాణ ప్రజల వాణిని తాము
సభలో వినిపించామని అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని సూచించారు. పదవులను పక్కన పెట్టి తాము
పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా
తెలంగాణ సాధిస్తామని కె కేశవ రావు
అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే
మేం పోరాటం చేస్తున్నామని అన్నారు.
కాగా
ఎంపీలు బడ్జెట్ సెషన్స్ను బహిష్కరించే యోచనలో
ఉన్నారు. తమను సభ నుండి
బహిష్కరించినందున అధిష్టానం నుండి పిలుపు వచ్చే
వరకు ఢిల్లీకి వెళ్లవద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో వరుస పర్యటనలు చేయాలనే
యోచనలో ఉన్నారు. శుక్రవారం ఎంపీలు భేటీ కానున్నారు. అప్పుడే
తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment