వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సాధ్యమైనంత మేర ఎదురు దాడి
చేసేందుకు సంసిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయన అవినీతిపై పార్టీ
నేతలు మండిపడుతున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్
కోట్లాది రూపాయలు అవినీతితో సంపాదించారని ఆరోపిస్తున్నారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
పైనా విమర్శలు చేయాలని పలువురు నేతలు పార్టీ సమావేశంలో
సూచించారు.
జగన్ను, వైయస్ను
వేరు వేరుగా చూస్తే ప్రజలు ఒప్పుకోరని, కాబట్టి ఇద్దరిని ఒకే గాటాన కట్టాలని
పార్టీ రాష్ట్ర పెద్దలకూ సూచించారు. అయితే దీనిని పిసిసి
చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. వైయస్ను అంటే
మంత్రివర్గం పైనా విమర్శలు వస్తాయని
సూచించారు. అయితే వైయస్ను
విమర్శించే విషయంలో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ
జరుగుతోంది. ఇదే సమయంలో పలువురు
నేతలు వైయస్ పైన బాహాటంగానే
విమర్శలు చేస్తుంటే మరికొందరు వాటిని ఖండిస్తున్నారు. ఇంకొందరు వైయస్ మా పార్టీ
నేతే అంటున్నారు.
ఇదే సమయంలో పార్టీ జగన్ పైన మరో
అస్త్రం ఎక్కు పెట్టేందుకు సిద్దమౌతున్నట్లుగా
కనిపిస్తోంది. జగన్ను రెడ్డి
సామాజిక వర్గానికి చెందిన నేతగా పలువురు రెడ్డి
సామాజిక వర్గం నేతలు ఆయన
వెంట వెళుతున్నారని, కానీ ఆయన రెడ్డి
కాదని చెప్పేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారట. ఇందుకోసం
వారు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారట. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ వర్గం ఇప్పుడు
జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఇది కాంగ్రెస్ను కలవరపెడుతోంది. శనివారం
సిఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి జెసి
దివాకర రెడ్డి దీనిపై తర్జనభర్జన పడ్డారట. వాస్తవానికి జగన్ రెడ్డి సామాజిక
వర్గానికి చెందినవారు కాదన్న ప్రచారం జోరుగా చేయాల్సిన అవసరం కాంగ్రెస్లోని
తమ వంటి వారిపై ఉందన్న
అభిప్రాయానికి వచ్చారు. వెంటనే ఎమ్మెల్యే వీర శివా రెడ్డితో
ఫోన్లో మాట్లాడారట. ఈ
అంశంపై విస్తృత ప్రచారం చేయాలని, రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్లోనే కొనసాగేలా ముమ్మర
ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.
తానూ
ఇక దీని పైనే మాట్లాడతానని
జెసి చెప్పారు. ఇందుకోసం ఎంపిగా నామినేషన్లు దాఖలు చేసిన పత్రాలు,
విద్యాసంస్థలో పేర్కొన్న సమాచారం లాంటివాటిని సేకరించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఇరవై సూత్రాల ఆర్థిక
కార్యక్రమం అమలు చైర్మన్ తులసి
రెడ్డి కూడా ఇటీవల ఇదే
అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ నివాసంలో ఏ
కార్యక్రమానికైనా క్రైస్తవ ఆచారాలనే అనుసరిస్తారన్నారు. ఇప్పటికే దళితులకు వైయస్ అన్యాయం చేశారని
చెప్పడం ద్వారా దళితులకు జగన్ను దూరం
చేసే ప్రయత్నాలు చేసిన కాంగ్రెసు ఇప్పుడు
రెడ్డి కార్డుతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
0 comments:
Post a Comment