హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా
మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలకు
సమాధానం చెప్పకుండా జగన్ ఎదురుదాడికి దిగుతున్నారని,
తమ పార్టీపై అపనిందలు వేస్తున్నారని, ఇది పద్ధతి కాదని
ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ గుణగుణాలపై, వ్యక్తిత్వంపై
ప్రజలు ఆలోచన చేయాలని ఆయన
కోరారు. అక్రమ ఆర్థిక లావాదేవీలు
జరిగాయని, అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని జగన్ మీద ఆరోపణలు
వచ్చాయని, వాటికి సమాధానం చెప్పకుండా జగన్ తమపై లేనిపోని
అపవాదులు వేస్తున్నారని ఆయన అన్నారు.
తనపై
వస్తున్న ఆరోపణలు నిజం కాదని జగన్
రుజువు చేసుకోవాలని ఆయన అన్నారు. తమ
పార్టీ నాయకుడిని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే హెచ్చరించారని, అల్లర్లు సృష్టించడం కాంగ్రెసు పార్టీ నైజం కాదని ఆయన
అన్నారు. వైయస్ జగన్ ప్రతిదాన్నీ
రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. సిబిఐ
విచారణలో జగన్పై ఆరోపణలు,
సంబంధాలు, బంధాలు, స్నేహాలు బయటకు వస్తున్నాయని, వాటికి
సమాధానం చెప్పకుండా వైయస్ జగన్ నంగనాచిలా
మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
జగన్పై కేసులను న్యాయస్థానాలు,
దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని, వాటితో కాంగ్రెసుకు ఏ విధమైన సంబంధం
లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో
ఉన్నప్పుడు హుందాగా మాట్లాడాలని ఆయన జగన్కు
సూచించారు. సెంటిమెంట్ కొద్దికాలం ఉంటుంది గానీ శాశ్వతంగా నిలబడదని
ఆయన జగన్ను ఉద్దేశించి
అన్నారు. అవాకులు చెవాకులు మాట్లాడితే నిలబడవని ఆయన అన్నారు. వైయస్
జగన్ అలా మాట్లాడడం చాలా
తప్పు అని ఆయన అన్నారు.
తప్పు చేసిన వ్యక్తికి శిక్ష
పడుతుందని ముందే జగన్కు
తెలుసునని ఆయన అన్నారు.
కోర్టు
ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు
చేస్తుంటే ఇదంతా కాంగ్రెసు చేస్తోందంటే
ఎలా అని ఆయన అడిగారు.
ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జగన్ అలా మాట్లాడుతున్నారని
ఆయన అన్నారు. తెలంగాణలో ఏడు స్థానాలకు ఉప
ఎన్నికలు జరిగితే వైయస్ జగన్ అభ్యర్థులను
పెట్టలేదని, ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేని నాయకుడు ఇతరులు తుడిచిపెట్టుకుపోతారని ఎలా అంటారని ఆయన
అన్నారు. చంద్రబాబు, వాయలార్ రవి మాట్లాడుకున్నారని చేసిన
వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
వారిద్దరు ఎప్పుడు కలిశారని ఆయన అడిగారు.
తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై
ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఎవరెవరు కలుసుకుంటున్నారు, ఎవరెవరు విడిపోతున్నారు, దాని వల్ల తనకు
ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్కలే
వేసుకుంటారని, ప్రజలు పట్టరని ఆయన అన్నారు. చంద్రబాబు
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం రాష్ట్రం దురదృష్టమని
ఆయన అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడడం ఏమిటని ఆయన అన్నారు. మంత్రివర్గం
తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యులమని, తెరవెనక
జరిగిన లావాదేవీలతో తమకు సంబంధం లేదని,
తెరవెనక లావాదేవీలతో ఎవరికైనా సంబంధం ఉంటే వారు అనుభవిస్తారని
ఆయన అన్నారు.
0 comments:
Post a Comment