హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై కాంగ్రెసు
పార్టీ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ అక్రమాలకు పాల్పడలేదని,
ఆయన కంపెనీలలోకి పెట్టుబడులు రాలేదని వైయస్ విజయమ్మ, షర్మిల
ప్రమాణం చేయగలరా అని విజయవాడ పార్లమెంటు
సభ్యులు లగడపాటి రాజగోపాల్ సవాల్ విసిరారు.
వైయస్
జగన్ ఒత్తిడితోనే మాజీ మంత్రి మోపిదేవి
వెంకట రమణ అప్పుడు సంతకాలు
చేశారని అన్నారు. పథకాలు మావి, అవినీతి కాంగ్రెసు
పార్టీది అని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా
ఉందన్నారు. వైయస్ జగన్ అవినీతి,
అక్రమాల పులిపై స్వారీ చేశాడని, అందుకే ఇప్పుడు ప్రాయశ్చితం అనుభవిస్తున్నాడని చిరంజీవి అన్నారు. భారీ అక్రమాలకు పాల్పడటం
వల్ల చివరకు ఊచలు లెక్కిస్తున్నాడన్నారు.
జగన్ను అక్రమంగా జైల్లో
పెట్టారన్నవిజయమ్మకు జగన్ కారణంగా భూములు
కోల్పోయిన వారి ఆక్రందన కనిపించడం
లేదా అని ప్రశ్నించారు. విజయమ్మ
ఉప ఎన్నికలలో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి
పనులు జరగాలంటే కాంగ్రెసును గెలిపించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులను జగన్ తిరిగి ఇచ్చి
వేయాలని వీర శివా రెడ్డి
సూచించారు. పార్టీలో కోవర్టులు ఉండటం దురదృష్టకరమన్నారు. వైయస్ మరణంపై
వారికి అనుమానాలు ఉంటే లిఖిత పూర్వకంగా
రాసివ్వాలని కానీ ఆరోపణలు చేయవద్దని
హితవు పలికారు.
కాంగ్రెసు
పార్టీ జగన్ పార్టీ పైన
కక్ష కట్టలేదని, వారే తమ పార్టీ
పైన కక్ష కట్టారని తులసి
రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెసును భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నార్నారు. దేశంలో ఎవరికీ ఇవ్వని గౌరవం కాంగ్రెసు వైయస్
కుటుంబానికి ఇచ్చిందన్నారు. వైయస్ ప్రభుత్వం కంటే
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోలవరంకు ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. ఎవరు అవినీతికి పాల్పడ్డా
చర్యలు తప్పవని కేంద్రమంత్రి పల్లం రాజు అన్నారు.
ప్రజలను
మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ చూస్తోందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
నీతికి పట్టం గట్టాలో, అవినీతికి
ఓటు వేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. జగన్ తప్పులు ఒప్పుకోవాలని
సూచించారు. జగన్ కంటే పెద్ద
ఆర్థిక నేరస్తుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అని పాలడుగు వెంకట్రావు ఆరోపించారు.
జగన్తో పాటు బాబును
కూడా జైల్లో పెట్టాలన్నారు. ప్రజల ఆస్తులను అమ్ముకున్న
వ్యక్తి బాబు అన్నారు. దివంగత
వైయస్ చేసిన తప్పులకు కాంగ్రెసు
పార్టీ క్షమాపణ కోరుతుందన్నారు. జగన్ తప్పు చేసినట్లు
ఆయన అంతరాత్మకు తెలుసునని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర
వెంకట రమణా రెడ్డి అన్నారు.
వైయస్ జ్ఞాపకార్థం ఆయన విగ్రహాలు ఏర్పాటు
చేసిందే తామేనన్నారు. వైయస్ మరణాన్ని వారు
కుటుంబీకులు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు.
విజయమ్మ
పరకాలకు వచ్చే ముందు తెలంగాణపై
తన వైఖరి చెప్పాలన్నారు. లేదంటే
సమైక్యవాదిగా గుర్తిస్తామని హెచ్చరించారు. బిజెపి, జగన్ సంబంధాలు తేటతెల్లమయ్యాయని
చెప్పారు. గాలి జనార్ధన రెడ్డిపై
మంత్రి రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. న్యాయమూర్తినే డబ్బుతో కొనబోయిన ఆయనకి ఎలాంటి శిక్ష
పడినా తప్పు లేదని వ్యాఖ్యానించారు.
రాయదుర్గం
కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణు గోపాల్ రెడ్డి
తరపున ఆదివారం రఘువీరా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఎన్నికల్లో ప్రజలు గాలికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. గాలి అనుచరుడు, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. బెయిలు కోసం న్యాయమూర్తిని ఆశ్రయించిన
వారిలో సహచర మంత్రి ఏరాసు
ప్రతాప రెడ్డి ప్రమేయం ఉందని వస్తున్న వార్తల్లో
వాస్తవం లేదని, ఇవన్నీ ఒట్టి ఆరోపణలేనని కొట్టిపారేశారు.
0 comments:
Post a Comment