హైదరాబాద్:
ఉప ఎన్నికలలో వామపక్ష పార్టీలు రెండు కలిసి పోటీ
చేసే అవకాశాలు లేవు. త్వరలో జరగనున్న
పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలలోని
ఉప ఎన్నికల విషయంపై సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు శుక్రవారం అరగంట
పాటు చర్చించారు. అయితే ఇరు పార్టీల
మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరికి వారే సొంతగా ఈ
ఉప ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయానికి
వారు వచ్చారు.
అనంతపురం,
పోలవరం, ఒంగోలు, పాయకరావుపేటలో సిపిఎం పోటీ చేయాలనే నిర్ణయానికి
వచ్చాయి. అయితే సిపిఐ మాత్రం
ఇంకా ఎక్కడ పోటీ చేయాలో
ఒక నిర్ణయానికి రాలేదు. అయితే పోటీ చేయకుండా
ఏదో ఒక పార్టీకి మద్దతిస్తేనే
బాగుంటుందనే అభిప్రాయంతో సిపిఐ ఉన్నట్లుగా తెలుస్తోంది.
అధికార కాంగ్రెసు, అవినీతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లుగా
తెలుస్తోంది.
అయితే
తమ మద్దతు అధికారికంగా ప్రకటించకుండా కేవలం ఆయా నియోజకవర్గాల
నేతలు, కార్యకర్తలకు మాత్రమే ఈ విషయాన్ని చెప్పాలని
భావిస్తున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికలలో భారీగా
అవుతున్న ఖర్చు కూడా సిపిఐని
పోటీ నుండి వెనక్కి నెట్టడానికి
ఓ కారణం అంటున్నారు. భేటీ
అనంతరం నారాయణ మాట్లాడుతూ.. ఇరుపార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని,
మా ఆలోచన వారి ఆలోచనలో
తేడా ఉందని చెప్పారు.
సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కూడా అదే చెప్పారు.
రాజకీయంగా ఇరుపార్టీలు కలిసి ముందుకు వెళ్లే
విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నాయని చెప్పారు. ఒంటరిగా ఉప ఎన్నికలలో పోటీ
చేస్తామని చెప్పారు.
కాగా
ఇరు పార్టీల మధ్య తెలుగుదేశం పార్టీ
విషయంలోనే ఏకాభిప్రాయం కుదరలేదనే వాదన వినిపిస్తోంది. తెలుగుదేశం
పార్టీతో పొత్తు పెట్టుకుందామని సిపిఐ పార్టీ నేతలు
సూచించగా అందుకు సిపిఎం ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. టిడిపితో పొత్తు ఉంటే తాము స్వతంత్రంగా
బరిలోకి దిగుతామని సిపిఎం చెప్పిందని అంటున్నారు. కాగా టిడిపి అనంతపురం
టిక్కెట్ ఇస్తే పోటీకి సిపిఐ
సిద్ధంగా ఉన్నదనే వార్తలు ఇంతకుముందు వచ్చిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment