న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ
తివారీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
పితృత్వ పరీక్ష కేసులో డిఎన్ఎ పరీక్షకు
సిద్ధపడాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తివారీని ఆదేశించింది. రక్తనమూనా ఇవ్వడానికి తివారీ నిరాకరిస్తే పోలీసుల సహాయం తీసుకోవాలని కోర్టు
సూచించింది. పితృత్వం కేసులో తివారీ రక్త నమూనాను ఇవ్వాలని
బలవంతం చేయవద్దని హైకోర్టు సింగిల్ జడ్డీ ఇచ్చిన ఆదేశాలను
డివిజన్ బెంచ్ తిరస్కరించింది.
తాను
తివారీకి పుట్టానని చెబుతున్న రోహిత్ శేఖర్ సింగిల్ జడ్డి
ఆదేశాలను డివిజన్ బెంచ్లో సవాల్
చేశారు. నాలుగు వారాల్లో ఎన్డీ తివారీ రక్త
నమూనాను ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రోహిత్
శేఖర్ అనే యువకుడు - తివారీని
తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల
శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను
వాదిస్తున్నాడు.
దాంతో
ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని
దెబ్బ తీసే చర్య అని
ఆయన అభివర్ణిస్తున్నారు. తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్లో జారీ చేసింది.
తివారీయే
తన అసలు తండ్రి అని
వాదిస్తున్న రోహిత్ శేఖర్ (31), ఆయన తల్లి ఉజ్వల
ఇంతకు ముందు మరో వైపు
నుంచి నరుక్కొచ్చారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్
డీఎన్ఏ, ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ)లో ఉజ్వల
భర్త బీపీ శర్మకు డీఎన్ఏ
పరీక్షలు జరిపించారు. ఈ నివేదికను సీల్డ్
కవర్లో ఢిల్లీ హైకోర్టుకు
సమర్పించారు. నివేదికను జస్టిస్ రేవా ఖేత్రపాల్ కోర్టులో
చదివి వినిపించారు.
రోహిత్
డీఎన్ఏ తల్లి ఉజ్వలతో సరిపోలుతోందని,
ఆమె భర్త బీపీ శర్మతో
సరిపోలడంలేదని తెలిపారు. దీంతో ఉజ్వల, బీపీ
శర్మల బంధం వల్ల రోహిత్
జన్మించలేదని రుజువైంది. 'తివారీయే నా తండ్రి' అన్న
రోహిత్ వాదనకు బలం చేకూరింది.
0 comments:
Post a Comment