హైదరాబాద్
: తన కుమారుడిని జైలుపాలు చేశారని వైయస్ విజయలక్ష్మి బాధపడుతున్నారని, ఆమె ఒక తల్లిగా
కాక ఒక పార్టీ అధ్యక్షురాలిగా
సమాధానం చెప్పాలని, అక్రమాస్తుల కేసులో జగన్కంటే ముందు
అనేక మంది జైలు పాలయ్యారని,
దానికి ఆమె కుమారుడు కారణం
కాదా అని, వారి కుటుంబాల
బాధను ఎవరు తీరుస్తారని తెలుగుదేశం
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్
వద్ద, అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్రమాస్తుల
కేసు విచారణలో అరెస్టులు ఒక భాగం మాత్రమేనని,
అయితే అరెస్టులతో సరిపెట్టకుండా అక్రమాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని పేదల సంక్షేమానికి వెచ్చించాలని
ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ చేసిన అవినీతి,
అక్రమాలతో రాష్ట్ర అభివృద్ధి స్తంభించిపోయిందని ఆయన విమర్శించారు. జగన్
రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి అనువుగా తప్పుడు జీవోలు ఇచ్చిన మంత్రులను కూడా వదిలి పెట్టే
ప్రశ్నే లేదని, వారు కూడా జైళ్ళకు
వెళ్ళే వరకూ మా పోరాటం
కొనసాగుతుందని ఆయన అన్నారు.
వైయస్
అవినీతిపై కాంగ్రెస్ అధిష్ఠానం మొదటే చర్యలు తీసుకొంటే
పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని, తెలుగుదేశం పార్టీని ఓడించాడనుకొని వైయస్ ఏం చేసినా ఢిల్లీ
నాయకత్వం ఉపేక్షించిందని, టీడీపీ నోరు మూయించడానికి మా
పార్టీ ఎమ్మెల్యే పరిటాల రవిని తమ పార్టీ
కార్యాలయంలోనే పట్టపగలు చంపించారని, అయినా మేం వెనక్కు
తగ్గలేదని, ఒక మంత్రి కూడా
జైలుకు వెళ్ళారంటే అది తమ పోరాట
ఫలితమేనని, గతంలో రాజీవ్ గాంధీ
బోఫోర్స్ కుంభకోణంపై కూడా ఇలాగే పోరాడామని
చంద్రబాబు వివరించారు.
తెలుగుదేశం
పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొన్నారు తప్ప కాంగ్రెస్ నేతల్లా
రాష్ట్రాన్ని దోచుకోలేదని చంద్రబాబు చెప్పారు. వైయస్ బతికున్న రోజుల్లోనే అక్రమాలు వెలుగుచూశాయని అంటూ ఈ అక్రమాలపై
తెలుగుదేశం డాక్యుమెంట్లతో సహా పుస్తకాలను ప్రచురించిన
విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రం భ్రష్టు పట్టి పోయిందని, ఎవరికి
అందినంత వారు లూఠీ చేసి
రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.
ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలపైకి ఎక్కించి
కాపాడే శక్తి ఒక్క తెలుగుదేశం
పార్టీకే ఉందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment