హైదరాబాద్:
అధికారులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్లేకార్డుల్లా వాడుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్
నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు
దత్తాత్రేయ ఆదివారం అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాజకీయ అవసరాల కోసమే ఎసిబిని ప్రయోగిస్తున్నారని
మండిపడ్డారు.
అధికారుల
బదలీలపై కిరణ్ కుమర్ రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
బాటలో నడుస్తున్నారని విమర్శించారు. ఎసిబి డిజిగా ఇప్పటికిప్పుడు
ప్రసాద రావును నియమించడంలో ఆంతర్యమేమిటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం రాజ్యసభ సభ్యుడు,
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి.హనుమంత
రావు రాజ్యసభలో ఏడవటం కాదని, ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద మొరపెట్టుకోవాలని
సూచించారు.
పరకాలలో
బిజెపి గెలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు
ఉండదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీపై
విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. తెరాస ఉద్యమాన్ని నీరుగార్చే
ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉద్యమంలో తెరాస చేస్తున్న తప్పులను
పరకాలలో ఎత్తి చూపిస్తామన్నారు. అక్కడ
తెరాస, బిజెపి మధ్యే పోటీ ఉంటుందని
చెప్పారు. తెరాసకు బిజెపి భయం పట్టుకుందన్నారు.
కాగా
తమ పార్టీని మతతత్వ పార్టీ అనడంపై బండారు దత్తాత్రేయ శనివారం తెరాస పైన విరుచుకు
పడిన విషయం తెలిసిందే. ముస్లింలీగ్,
ఎంఐఎంతో కలిసిన తెరాస తమ పార్టీ
మతతత్వ పార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఆ
పార్టీకి లేదన్నారు. తెలంగాణ బిజెపి ద్వారా సాధ్యమన్నారు.
0 comments:
Post a Comment