చిత్తూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ వీడి వెళ్లినప్పటికీ రాజ్యసభ
సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి
రాకతో లాభపడ్డామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం
అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం
నిమిత్తం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన జగన్, ఆయన
పార్టీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు విధివిధానాలు ఏమాత్రం లేని పార్టీ అన్నారు.
ఆ పార్టీ జెండాలో ఉన్న పథకాల బొమ్మలు
అన్నీ కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేస్తున్నవే అని
చెప్పారు. కాంగ్రెసు జెండా పెట్టుకొని అది
వైయస్సార్ కాంగ్రెసు అజెండా అంటూ జగన్ ప్రజలను
తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జగన్ సాక్షి మీడియాకు
ప్రకటనల నిలిపివేత సబబే అన్నారు.
ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని
చెప్పారు. ప్రజలు టిడిపిని గానీ, వైయస్సార్ కాంగ్రెసు
పార్టీని గానీ నమ్మే పరిస్థితిలో
లేరన్నారు. తెలుగుదేశం పార్టీకి మూడో స్థానంలో నిలుస్తుందని
ఆయన జోస్యం చెప్పారు. కాగా శుక్రవారం తిరుపతిలో
బొత్సతో పాటు చిరంజీవి, ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార సభలో పాల్గొననున్నారు.
వైయస్
జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులపై సమగ్ర
దర్యాఫ్తు జరగాల్సి ఉందని బొత్స గురువారం
చెప్పిన విషయం తెలిసిందే. ఏ
మీడియా సంస్థతోనూ ప్రభుత్వం కుమ్మక్కు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
సిబిఐ జగన్ ఆస్తుల కేసు
విషయంలో చట్ట ప్రకారమే పని
చేస్తోందని చెప్పారు. ఆయన శ్రీ పొట్టి
శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు.
సిబిఐ
విచారణ ఎలాంటి కక్ష సాధింపు చర్య
కాదని అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా జగన్ కాంగ్రెసు పార్టీ
పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అవస్తలు పడుతుంటే జగన్ వర్గం నేతలు
రాజీనామా చేసి ఉప ఎన్నికలకు
కారకులయ్యారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని ప్రజలకు సూచించారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు
పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు.
0 comments:
Post a Comment