హైదరాబాద్:
తనపై కుట్ర జరుగుతోందని మంత్రి
మోపిదేవి వెంకటరమణ భావిస్తున్నట్లు సమాచారం. పదేపదే సిబిఐ అధికారులు విచారణ
పేరిట తనను పిలవడంపై ఆయన
ఆవేదన చెందుతున్నట్లు చెబుతున్నారు. తనకు తన మంత్రివర్గ
సహచరులు కూడా సహకరించడం లేదని,
తాను బలహీనవర్గాలకు చెందినవాడిని కావడం వల్లనే ఇలా
జరుగుతోందని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా మోపిదేవి బుధవారం కూడా సీబీఐ ఎదుట
హాజరయ్యారు. దాదాపు ఐదుగంటల సేపు సీబీఐ అధికారుల
వద్దే గడపాల్సి వచ్చింది. మళ్లీ గురువారం కూడా
వారి ముందు హాజరు కావాల్సిన
పరిస్థితి నెలకొనడంతో మోపిదేవి బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
తనను
అరెస్టు చేస్తారంటూ విస్తృత ప్రచారం జరగడానికి వెనుక బలమైన కారణం
ఏదైనా ఉందా అనే సందేహాన్ని
వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవిని అరెస్టు చేయాల్సి వస్తే ముందుగానే ఆయన
రాజీనామా చేస్తారా అనే వాదనలూ వినిపిస్తున్నాయి.
కేంద్ర మాజీమంత్రి రాజా అరెస్టుకు ముందు
ఆయనతో రాజీనామా చేయించారు. అలాగే అరెస్టు తప్పనిసరి
అయితే అయితే మంత్రి రాజీనామా
చేయాలి.. లేదా ప్రభుత్వమైనా ఆయనను
తొలగించాలి. మోపిదేవి మాత్రం తాను తప్పేమీ చేయలేదని,
అలాంటప్పుడు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం
జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదనకు గురైన
ఆయన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో
బుధవారం రాత్రి దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు.
తనను అనవసరంగా బలిపశువును చేసే ప్రయత్నం చేస్తున్నట్లు
ప్రచారం జరుగుతోందని, ఇదంతా ఎందుకని ఆయనను
కూడా అడిగినట్లు చెబుతున్నారు. అయితే, సీఎం నుంచి ఆయనకు
సరైన స్పందన రాలేదని, పొడి పొడి మాటలతో
కిరణ్ కుమార్ రెడ్డి సరిపెట్టారని అంటున్నారు. దీంతో ఆ తర్వాత
ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ
అయ్యారు.
బలహీనవర్గానికి
చెందిన తనను రాజకీయంగా బలిపశువును
చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయాన్ని మోపిదేవి తన సన్నిహితుల వద్ద
వ్యక్తం చేశారని సమాచారం. ఇటీవల మద్యం సిండికేట్లు,
ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో తన
పేరును ఇరికించారని, దాని నుంచి ఇప్పుడిప్పుడే
బయట పడుతున్న సమయంలో మళ్లీ విచారణల పేరిట
తనను పదే పదే సీబీఐ
అధికారులు పిలవడం వెనుక ఏదైనా కుట్ర
ఉందేమోనని ఆందోళన చెందుతున్నారు.
0 comments:
Post a Comment