హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల
కేసులో ఐటి శాఖ మంత్రి
పొన్నాల లక్ష్మయ్యకు సిబిఐ నుంచి పిలుపు
వచ్చింది. ఈనెల 7న విచారణకు
హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ
చేసింది. ఆయన హయాంలో జరిగిన
నీటి కేటాయింపులపై ప్రశ్నించేందుకే నోటీసులు పంపినట్లు తెలిసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు
పెట్టిన ఇండియా సిమెంట్స్ కంపెనీకి వైయస్ రాజశేఖర ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా నీటి కేటాయింపులు జరిగాయనే
ఆరోపణలు ఉన్నాయి. వైయస్ మంత్రివర్గంలో పొన్నాల
భారీ నీటి పారుదల శాఖ
మంత్రిగా పనిచేశారు.
అప్పట్లో
భారీ నీటి పారుదల శాఖ
ఉన్నతాధికారిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్,
మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ జీవోలు జారీ
చేశారు. ఆదిత్యనాథ్ను నెలరోజుల కిందటే
సీబీఐ అధికారులు పిలిచి ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రి పొన్నాలకూ పిలుపు అందింది. దీంతో సిబిఐ విచారణ
ఎదుర్కొన్న మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి,
మోపిదేవి వెంకట రమణ, ధర్మాన
ప్రసాదరావుల సరసన పొన్నాల పేరూ
చేరనుంది. ఇండియా సిమెంట్స్ సంస్థ జగతి పబ్లికేషన్స్లో రూ.40 కోట్లు
పెట్టుబడిగా పెట్టింది. జగన్కు చెందిన
ఇతర కంపెనీల్లో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
ఇదంతా
'క్విడ్ ప్రొ కో'లో
భాగమేనని సీబీఐ ఆరోపిస్తోంది. ఇండియా
సిమెంట్స్ కృష్ణా నది నుంచి రోజుకు
3 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే ఉపయోగించుకునేందుకు ఉన్న అనుమతిని 2008లో
వైయస్ ప్రభుత్వం 10 లక్షల గ్యాలన్లకు పెంచినట్లు
తెలిపింది. ఈ విషయంలో అంతర్రాష్ట్ర
జల ఒప్పందాలను కూడా ఉల్లంఘించినట్లు ఆరోపణలు
వచ్చాయి. జగన్ అక్రమాస్తుల కేసుకు
సంబంధించి గుర్తించిన 26 వివాదాస్పద జీవోల్లో ఇండియా సిమెంట్స్కు నీటి కేటాయింపులు
చేస్తూ జారీ చేసిన రెండు
జీవోలు కూడా ఉన్నాయి.
ఈ జీవోల జారీతో ప్రమేయమున్న
ఐఎఎస్ అధికారులకు, మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు
సుప్రీం ఆదేశాల మేరకే పొన్నాలను సిబిఐ
ప్రశ్నించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వాన్పిక్ భూముల
వ్యవహారంలో మోపిదేవిని పిలిచి ప్రశ్నించిన సిబిఐ అధికారులు ఆయనను
అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఇతర మంత్రుల్లోనూ
అరెస్టుల గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో పొన్నాలకు
పిలుపు అందడం గమనార్హం.
0 comments:
Post a Comment