హైదరాబాద్:
ఓఎంసి కేసులో అరెస్టైన కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డి తదితరులకు చెందిన జప్తు చేసిన వాహనాల
విలువపై నివేదిక పంపాలని మంగళవారం సిబిఐ కోర్టు సంబంధిత
అధికారులను ఆదేశించింది. ఓఎంసి కేసు విచారణలో
భాగంగా గాలి, బివి శ్రీనివాస్
రెడ్డిలకు చెందిన హెలికాప్టర్తో పాటు ఖరీదైన
కార్లను సిబిఐ జప్తు చేసిన
విషయం తెలిసిందే. వాటిని వినియోగించకుంటే శిథిలమవుతాయని, అందువల్ల తమకు అప్పగించాలని గాలి,
శ్రీనివాస్ రెడ్డిలు సిబిఐ కోర్టులో పిటిషన్
దాఖలు చేశారు.
హెలికాప్టర్
నిర్వహణ ఖర్చు నెలకు లక్షల్లో
ఉంటుందని తెలిపారు. కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాటిని స్వాధీనం చేస్తామని చెప్పారు. దీనికి సిబిఐ తీవ్ర అభ్యంతరం
వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా
వచ్చిన ఆదాయంతోనే వాటిని కొన్నారని, వారికి అప్పగిస్తే అమ్మేస్తారని తెలిపింది.
ఈ నేపథ్యంలో పిటిషన్ పైన తగిన నిర్ణయం
తీసుకోవడానికి వీలుగా ఆయా వాహనాల విలువపై
నివేదిక తెప్పించాలని సిబిఐ కోర్టు నిరణయించింది.
డిజిసిఏ అధికారికి లేఖ రాసి బెంగళూరులో
ఉన్న హెలికాప్టర్, బళ్లారి ఎంవిఐ నుంచి కార్ల
విలువపై నివేదిక తెప్పించాలని కోర్టు తన సిబ్బందికి సూచించింది.
తదుపరి విచారణను 26వ తేదికి వాయిదా
వేసింది.
మరోవైపు
గాలి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో
సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇనుప
ఖనిజాన్ని యథేచ్ఛగా లూటీ చేసిన గాలి
జనార్ధన్ రెడ్డి ప్రజా ధనాన్ని భారీగా
కొల్లగొట్టారని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.
ఇది తీవ్రమైన వైట్ కాలర్ ఆర్థిక
నేరమని, ఈ కేసును ప్రత్యేకంగా
పరిగణించాలని కోరింది. ఈ కేసులో సాక్షులకు
బెదిరింపులు వస్తున్నాయని, జనార్ధన్ రెడ్డి బయట ఉంటే వారికి
హాని ఉంటుందని తెలిపింది.
ఆయనకు
కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను
రద్దు చేయాలని సిబిఐ తరఫున అదనపు
సొలిసిటర్ జనరల్ కోరారు. ఓఎంసి
ఇనుప ఖనిజ అక్రమ తవ్వకం
కేసులో నిందితుడైన గాలికి సిబిఐ కోర్టు గత
నెల 11న మంజూరు చేసిన
బెయిల్ను సవాలు చేస్తూ
సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై
మంగళవారం విచారణ చేపట్టారు. దీనిపై బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.
0 comments:
Post a Comment