హైదరాబాద్:
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలాగే ఉప ఎన్నికల ఫలితాలపై
తన అంచనాలు చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో
మెజారిటీ సీట్లు వైయస్ జగన్కు
చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే వస్తాయని ఆయన చెప్పారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని ఆయన మంగళవారం సాయంత్రం
మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వైయస్ జగన్ అన్ని
అస్త్రాలను ఈ ఎన్నికల్లో వాడడం,
తాము కాస్తా ఆలస్యంగా ఎదురుదాడికి పూనుకోవడం అందుకు కారణమని ఆయన అన్నారు.
కాంగ్రెసు
పార్టీకి ఒకటి నుంచి మూడు
సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం
పార్టీకి సున్నా నుంచి 2 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు రాకపోయినా
ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు.
పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధిస్తుందని ఆయన
చెప్పారు. జగన్ అరెస్టు తర్వాత
వైయస్ విజయమ్మ, షర్మిల కన్నీళ్ల ప్రచారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మారిందని ఆయన చెప్పారు. నెల్లూరు
లోకసభ స్థానం గురించి ఈ నెల 14వ
తేదీన చెప్తానని ఆయన అన్నారు.
వైయస్
జగన్ పార్టీ ఈ ఎన్నికల్లో మెజారిటీ
సీట్లు సాధించినా భవిష్యత్తులో ఘోరంగా దెబ్బ తింటుందని, ఈ
ఉప ఎన్నికల్లో జగన్ చివరి అస్త్రం
కూడా ఉపయోగించారని, ఆ తర్వాత వాడడానికి
ఏ ఆయుధాలూ ఉండవని ఆయన అన్నారు. కాంగ్రెసు
యంత్రాంగం ఐక్యంగా పనిచేసిందని ఆయన చెప్పారు. జగన్
ఎండగట్టే విషయంలో కాస్తా ముందుగా దృష్టి సారించి ఉంటే ఫలితాలు కాస్తా
భిన్నంగా ఉండేవని ఆయన అన్నారు. కాంగ్రెసు
యంత్రాంగం మాత్రం పటిష్టంగా తయారైందని ఆయన అన్నారు. చాలా
చోట్ల కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసుల మధ్య హోరాహోరీ పోటీ
జరిగందని, తన బలాన్ని కాంగ్రెసు
పెంచుకుందని ఆయన అన్నారు.
వారంలో
కాంగ్రెసు బలం గణనీయంగా పెరిగిందని
ఆయన చెప్పారు. జగన్ అరెస్టు వల్ల
సానుభూతి రాలేదు గానీ వైయస్ విజయమ్మ,
షర్మిల ప్రచారం వల్ల సానుభూతి వచ్చిందని
ఆయన చెప్పారు. జగన్ అరెస్టు విషయంలో
వైయస్సార్ కాంగ్రెసు చేసిన ప్రచారాన్ని తాము
తిప్పికొట్టగలిగామని ఆయన చెప్పారు. ఊగిసలాట
లేకుండా, అయోమయం లేకుండా కాంగ్రెసు యంత్రాంగం తయారైందని ఆయన చెప్పారు. గతంలో
కన్నా మెరుగైన స్థితి ఉందని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ మొదటి నుంచీ
అబద్దాలు చెబుతున్నారని, అసలు జగన్ పార్టీ
పుట్టుకే అబద్ధాలతో జరిగిందని ఆయన అన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి మృతి విషయంలో చేసిన
విమర్శలను కూడా తాము సమర్థంగా
తిప్పికొట్టామని ఆయన చెప్పారు. జగన్ను ఈ సమయంలో
ఎందుకు అరెస్టు చేశారనే సందిగ్దత మొదట నెలకొందని, ఆ
సందేహాలను తీర్చగలిగామని, కాంగ్రెసులో ఉంటే ఎప్పుడో అరెస్టు
అయి ఉండేవారని చెప్పామని ఆయన అన్నారు. వైయస్సార్
కాంగ్రెసు, కాంగ్రెసు మధ్య స్పష్టంగా విభజన
వచ్చిందని ఆయన చెప్పారు. చాలా
చోట్ల పోటీ నువ్వా నేనా
అన్నట్లుగా జరిగిందని, దీంతో కాస్తా ఫలితాలు
అటు ఇటుగా ఉండవచ్చని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment