హైదరాబాద్:
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో
సిఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఉప
ఎన్నికలపై వారు చర్చించారు. పద్దెనిమిది
అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే
ఎన్నికల సంఘం షెడ్యూలు కూడా
విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉప
ఎన్నికలపై వారు చర్చించారు.
ఆయా నియోజకవర్గాలలో పోటీలో నిలపాల్సిన అభ్యర్థుల పైన, ఇంకా ఏ
ఏ నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించాలి, అభ్యర్థుల ప్రకటనలో ఏఏ అంశాలు పరిగణలోకి
తీసుకోవాలనే తదితర అంశాలపై చర్చించినట్లుగా
తెలుస్తోంది. రెండు మూడు రోజులలో
అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్టానానికి
పంపనున్నారు. అధిష్టానం ఓకె చెబితే వారిని
ప్రకటిస్తారు.
బొత్స,
కిరణ్తో పాటు ఈ
భేటీలో అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి,
మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి,
శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. వీరి ప్రధానంగా ఆళ్లగడ్డ,
అనంతపురం నియోజకవర్గాలపై బొత్స, కిరణ్లతో చర్చించారు.
భేటీలో పాల్గొన్న అనంత వెంకట్రామి రెడ్డి
తన కుటుంబ సభ్యులు ఎవరు అనంతపురం నుండి
పోటీ చేయరని తేల్చి చెప్పారు. అయితే అక్కడ ఎవరు
పోటీ చేసినా తమ పూర్తి మద్దతు
ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు
భేటీ అనంతరం ఏరాసు ప్రతాప్ రెడ్డి
విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి గంగుల ప్రతాప్
రెడ్డియే పోటీ చేస్తారని ఆయన
చెప్పారు. ఇతరులు అక్కడ నుండి పోటీ
చేసే ప్రసక్తే లేదన్నారు. నిధులు రాకపోవడంతో ఏదో కాస్త తన
బాధను ఆయన వ్యక్తం చేశారని
వివరణ ఇచ్చారు. కాగా అంతకుముందు మంత్రి
సుదర్సన్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.
0 comments:
Post a Comment