న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ లేకుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ అని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు శుక్రవారం ప్రశ్నించారు. సోనియా లేకుంటే వైయస్ లేరన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కరివే కావన్నారు. వైయస్ పథకాలు సోనియా గాంధీ ఆలోచనలని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు వైయస్ ప్రవేశపెట్టినప్పటికీ సోనియా కార్యక్రమాలే అని చెప్పారు. సోనియా ఆలోచనలే వైయస్ పథకాలుగా ప్రజల్లోకి వెళ్లాయని చెప్పారు. కాగా అంతకుముందు వి.హనుమంత రావు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాల గురించి ఆయన సోనియాకు వివరించినట్లుగా తెలుస్తోంది. శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా సోనియాను కలిశారు.
కాగా ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై పలువురు కాంగ్రెసు పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం మంత్రి కొండ్రు మురళి మోహన్ దివంగత వైయస్ పైన నిప్పులు చెరిగారు. వైయస్ దళిత వ్యతిరేకి అని, ఆయన హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
గురువారం సీనియర్ నేత వెంకట్రావు కూడా వైయస్ పైన విమర్శలు గుప్పించారు. వైయస్కు కాంగ్రెసు పార్టీ సిద్ధాంతాలు తెలియవని, తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయలేదని ఆయన విమర్శించారు. పార్లమెంటు సభ్యుడు జెడి శీలం కూడా వైయస్ పైన కాస్త ఘాటు విమర్శలే చేశారు. అయితే ఆయన తాను అలా అనలేదని మళ్లీ వివరణ ఇచ్చుకున్నారు.
0 comments:
Post a Comment