హైదరాబాద్:
ప్రైవేట్ పాఠశాలలు కూడా పేద విద్యార్థులకు
25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలనే సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కంగు తిన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పాఠశాలలు
ఇబ్బడి ముబ్బడి వచ్చేసి పక్కా వ్యాపార దృక్పథంతో
నడుస్తున్నాయి. విద్యా హక్కు చట్టం కింద
సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను
రివ్యూ పిటిషన్ ద్వారా సవాల్ చేయాలని ప్రైవేట్
పాఠశాలల యాజమాన్యాలు భావిస్తున్నాయి. దాదాపు 7,500కు పైగా పాఠశాలల
యాజమాన్యాలు అందుకు సిద్ధపడుతున్నాయి.
సుప్రీంకోర్టు
ఆదేశాల వల్ల తమ వ్యాపారం
దెబ్బ తింటుందని భావిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు ఓ నెలలో రివ్యూ
పిటిషన్ వేయడానికి సమాయత్తమవుతున్నాయి. జాతీయ అనుబంధం వల్ల
తమకు సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించకూడదని వాదించేందుకు హైదరాబాదులోని ఐసిఎస్ఇ, సిబిఎస్ఇ పాఠశాలలు సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యావ్యాపారం
జరుగుతుండడంతో ఈ పరిస్థితి వచ్చింది.
సుప్రీంకోర్టు
ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్రంలోని
17,500 పాఠశాలలు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు గ్రేడింగ్ ఇచ్చి సుప్రీంకోర్టు ఆదేశాలను
గ్రామీణ ప్రాంతాల నుంచి అమలు చేయడానికి
కృషి చేస్తామని విద్యాశాఖ అధికారులంటున్నారు. అయితే, విద్యా హక్కు చట్టంలోని పలు
నిబంధనలను వివిధ జీవోల ద్వారా
ప్రభుత్వం ఇప్పటికే నిర్వీర్యం చేసిందని విద్యావేత్తలు అంటున్నారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో సీట్లన్నీ భర్తీ అయిన తర్వాత
ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచితంగా సీట్లు
ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో జారీ
చేసింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఈ జీవో ఊరటనిచ్చింది.
విద్యా
హక్కు చట్టం అమలును నిర్వీర్యం
చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో
మరో క్లాజ్ ఉంది. ప్రైవేట్ పాఠశాలలు
ఉన్న కిలో మీటరు పరిధిలోపల
పేదలు లేకపోతే 25 శాతం సీట్లు పేద
విద్యార్థులకు ఇవ్వాలనే నిబంధనను అమలు చేయాల్సిన అవసరం
లేదనేది ఆ క్లాజ్ సారాంశం.
దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కాకుండా ఆ
జీవో అడ్డుకుంటుందని విద్యావేత్తలు అంటున్నారు. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రిక
సవివరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది.
ప్రభుత్వం
ఎందుకు అలా జీవో జారీ
చేసింది?
ఆ జీవో జారీని సాకుగా
తీసుకుని ఇప్పటికే కొన్ని పాఠశాలలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి.
తమ పాఠశాలల పక్కన ఉన్న ప్రభుత్వ
పాఠశాలల్లో పూర్తిగా సీట్లు భర్తీ కాలేదని, అందువల్ల
తాము పేద విద్యార్థులకు 25 శాతం
సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కొన్ని
పాఠశాలలు వాదిస్తుండగా, తమ పాఠశాలల పక్కన
పేదలెవరూ లేరనే సాకును మరికొన్ని
పాఠశాలలు చూపిస్తున్నాయి.
రాష్ట్రంలో
ప్రైవేట్ విద్యావ్యాపారం మర్రి వృక్షంలా విస్తరించింది.
ఆ వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ప్రభుత్వం
నుంచి పనులు చేయించుకోవడం వారిది
అందె వేసిన చేయిగా మారింది.
కొన్ని బలమైన విద్యాసంస్థల చెప్పుచేతల
మేరకే విద్యావ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు జురగుతున్నాయనే అభిప్రాయం ఉంది.
కొన్ని
యాజమాన్యాలు గొలుసు కట్టు పాఠశాలలు ఏర్పాటు
చేసి, వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు
కాయలుగా విస్తరించుకుంటున్నారు. కొంత మంది పాఠశాలల
యాజమాన్యాలు విద్యావ్యాపారం ద్వారా సమకూరిన ఆర్థిక బలంతో రాజకీయాల్లోకి కూడా
అడుగు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దెబ్బ తిన్నాయనే అభిప్రాయం
బలంగా నాటుకుంది. ఈ స్థితిలో పేదలు,
సంపన్నులు అనే తేడా లేకుండా
ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చడానికే
తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈ స్థితిలో జీవో
పేదలకు కాస్తా ఊరటగా ఉండింది. కానీ
దానికి చిల్లులు పెట్టి డబ్బులు చెల్లించలేని విద్యార్థులను తోసిపుచ్చే మార్గాలను ప్రైవేట్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి.
0 comments:
Post a Comment