Friday, October 5, 2012

Ys jagan deal with Dalmia cements

దాల్మియా సిమెంట్స్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ 140 కోట్ల డీల్ నడిపినట్లు వెల్లడైంది. ఈ మేరకు శనివారం వివిధ పత్రికల్లో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. దాల్మియా సిమెంట్స్‌పై కొన్నాళ్ల క్రితం ఐటీ అధికారులు మెరుపు దాడులు జరిపారు. దాల్మియా సంస్థ తన ఉద్యోగుల పేరుతో పెద్ద సంఖ్యలో లాకర్లు నిర్వహిస్తున్న సంగతిని గుర్తించారు. ఈ లాకర్లలో రూ.14 కోట్ల నగదు, 5 కోట్ల విలువైన ఆభరణాలు గుర్తించారు. వాటిలోని ఒకానొక లాకర్‌లో ఒక కంప్యూటర్ హార్డ్‌డిస్క్ కూడా లభించింది. అనేక కీలక రహస్యాలు ఆ హార్డ్ డిస్క్‌లో నిక్షిప్తమైనట్లు వార్తాపత్రికల కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఐటీ అధికారులు హార్డ్ డిస్క్‌లోని సమాచారాన్ని విశ్లేషించడంతో వైయస్ జగన్‌తో సహా పలువురు రాజకీయ పార్టీలకు తాము చెల్లించిన, చెల్లించాల్సిన డబ్బుల వివరాలతో కూడిన డాక్యుమెంట్ ఒకటి బయటపడింది. 'జగన్‌కు రూ.140 కోట్లు ఇవ్వాలి. ఇందులో.. 55 కోట్లు చెల్లించాం. మరో 85 కోట్లు ఇవ్వాల్సి ఉంది!' అని అందులో పేర్కొన్నారు. అంటే... ఇచ్చింది 55 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది రూ.85 కోట్లు. అంటే... మొత్తం 140 కోట్ల డీల్ అంటూ పత్రికలు వ్యాఖ్యానించాయి.



జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో వికాట్ గ్రూప్ (ఫ్రాన్స్) అనుబంధ సంస్థ పర్‌ఫిసిమ్ 51 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇందుకోసం 2700 కోట్ల రూపాయలను వెచ్చించింది. భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో జగన్ సొంత కంపెనీల వాటా 78.89 శాతం. దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, నిమ్మగడ్డ ప్రసాద్‌ల వాటా 21.11 శాతం. ఫ్రాన్స్ కంపెనీతో డీల్ దరిమిలా భారతి సిమెంట్‌లో జగన్ గ్రూప్‌నకు 49 శాతం వాటా మిగిలింది.

మీడియా కథనాల ప్రకారం - ఇతర భాగస్వాములు తమ వాటాలను పూర్తిగా విక్రయించి బయటపడ్డారు. దాల్మియా గ్రూప్ తన వాటాలను విక్రయించగా, అన్ని పన్నులు మినహాయించిన తర్వాత లభించిన మొత్తం 140 కోట్లు. ఇప్పుడు జగన్‌కు దాల్మియా గ్రూప్ చెల్లించిన/చెల్లించాల్సిన మొత్తం కూడా రూ.140 కోట్లే! దీంతో ఐటీ అధికారులకు అనేక అనుమానాలు తలెత్తాయి. తమ సోదాలో గుర్తించిన వివరాలన్నీ సీబీఐకి సమర్పించారు. దీనిపై సీబీఐ మరింత లోతుగా కూపీలాగడం మొదలుపెట్టింది.

భారతి సిమెంట్స్‌లో తన వాటాల విక్రయం ద్వారా వచ్చిన రూ.140 కోట్లను యధాతథంగా జగన్‌కు బదిలీ చేయాలని దాల్మియా భావిస్తున్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇది... పక్కా మనీ లాండరింగ్. జగన్ కంపెనీల్లో పెట్టినవి పెట్టుబడులు కావని, అచ్చోసిన ముడుపులని సిబిఐ బలంగా వాదిస్తోంది. దాల్మియాకు కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపురాయి భూములను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. దాల్మియా సిమెంట్స్ దేశీయ సిమెంట్ రంగంలోని అగ్రగామి కంపెనీల్లో ఒకటి. అయినా కూడా కొత్తగా పుట్టుకొచ్చిన భారతి సిమెంట్స్‌లో తొలుత 110 రూపాయల రేటుతో ఆ తర్వాత ఏకంగా 1450 రూపాయల రేటుతో షేర్లను దాల్మియా కొనుగోలు చేసింది. మొత్తం రూ.95 కోట్ల 'పెట్టుబడి' పెట్టింది.

సిబిఐ వాదన ప్రకారం... రూ.95 కోట్లు జగన్‌కు ముడుపులుగా అందినవే. కానీ దాన్ని దాల్మియా పెట్టుబడిగా చూపించి, వాటాలు విక్రయించగా వచ్చిన రూ.140 కోట్లను తిరిగి జగన్‌కు బదిలీ చేసినట్లు సిబిఐ భావిస్తోంది. దాల్మియా లాకర్లలో దొరికిన హార్డ్ డిస్క్‌తో మొత్తం గుట్టు రట్టయింది. భారతి సిమెంట్స్‌లో షేర్లను కొనుగోలు చేసిన ఫ్రెంచ్ సంస్థకు కొందరు అమెరికన్ ఫండ్ మేనేజర్లు నిధులు సమకూర్చినట్టుగా చెబుతున్నారు. ఈ ఫండ్ మేనేజర్లు ఎవరు.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లోని కంపెనీ కొనుగోలు కోసం వారెందుకు నిధులు సమకూర్చారు? వారి వెనక ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది.

ఇప్పటి వరకు జగన్ కంపెనీల్లోకి కోల్‌కతా, చెన్నై, ముంబైకి చెందిన అనామక కంపెనీల నుంచి వచ్చిన సొమ్మును మాత్రమే అనుమానాస్పదంగా చూస్తున్నారు. బడా కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన సొమ్మును క్విడ్ ప్రొ కో గా వ్యవహరిస్తున్నారు. దాల్మియా లాకర్ల గుట్టుతో క్విడ్ ప్రొ కో కోణానికి మనీలాండరింగ్ దందా కూడా తోడవుతుంది.

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget